1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:39 IST)

జగన్ సర్కార్ కీలక నిర్ణయం: గ్రామ పంచాయితీకో డిజిటల్ లైబ్రరీ

ఏపీలోని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయితీకో డిజిటల్ లైబ్రరీని అందించాలని డిసైడ్ అయ్యింది. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం గ్రామాల్లోనూ మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు.  
 
ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తో పాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా వుండేలా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని అధికారలకు సీఎం ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ కూడా అందుబాటులో వుంచాలన్నారు.
 
ఇక ప్రతి గ్రామ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు.  
 
మొదటి విడతలో 4530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి అప్పగించాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
డిజిటల్‌ లైబ్రరీ బిల్డింగులో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాపులు, యూపీఎస్,  డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ వుండాలన్నారు. 
 
స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్‌టాప్‌ టేబుల్స్, సిస్టం చెయిర్స్, విజిటర్‌ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్‌లు, ఐరన్‌ రేక్స్‌, వార్తాపత్రికలు, మేగజైన్స్‌ డిజిటల్‌ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలన్నారు. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్‌ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్‌ పరికరాలకోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేయనున్న సీఎం తెలిపారు.