1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (19:18 IST)

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు.. పాతవారికే టిక్కెట్లు : సీఎం కేసీఆర్

kcrcm
తెరాస విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని తెరాస భవన్‌లో జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికలు పాతవారికే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. అయితే, విజయం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను నిలువరించేందుకు గట్టిగానే ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా, తెరాసను బీజేపీ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అందువల్ల బీజేపీ నేతలు ఒక మాట అంటే మనం పది మాటలు అనేలా పార్టీ నేతలు ఉండాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొవద్దని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 
 
పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ, వైకాపా బంధాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. బీజేపీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయని అన్నారు. 
 
ఒకవైపు తమకు అనుకూలంగా ఉన్న జగన్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.