1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (13:52 IST)

బీజేపీలోకి క్యూ కట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

dasoju sravan kumar
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మునుగోడు స్థానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇపుడు మరో కీలక నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఢిల్లీలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం శ్రవణ్‌కు భాజపా నేతలు అభినందనలు తెలిపారు.
 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల దాసోజు శ్రవణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
పార్టీకి క్రియాశీలకంగా అహోరాత్రులు ఎంతో కష్టపడ్డానని.. కానీ రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ నాయకత్వంలో అరాచక పరిస్థితులు తనను కలిచివేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రవణ్‌ ఢిల్లీ వెళ్లి పార్టీ ముఖ్యనేతల సమక్షంలో భాజపాలో చేరారు.