1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (07:42 IST)

కేసీఆర్ లేకుంటే ఆ గాడిదలకు పదవులు వచ్చేవా? మంత్రి కేటీఆర్

ktramarao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించే వారికి తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే కౌంటరిచ్చారు. కేసీఆర్ అనే నాయకుడు లేకుండా ఆయనపై విమర్శలు చేసే గాడిదలకు పదవులు వచ్చేవా అని సూటిగా ప్రశ్నించారు. 
 
సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు పనికిమాలిన దద్దమ్మలన్నారు. సీఎం పదవిని, వయసును చూడకుండా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
తెలంగాణ తెచ్చిన నాయకుడిని సోయి మరిచి రోడ్ల మీద తిరుగుతూ కేసీఆర్‌పై అడ్డం పొడుపు మాట్లాడుతున్న గాడిదలకు పదవులు వచ్చేవా? అని ప్రశ్నించారు. కేసీఆర్, తెరాస లేకుంటే జీవితంలో తెలంగాణ వచ్చేదా? టీ కాంగ్రెస్, టీబీజేపీ ఉండేవా? పదవులు ఉన్నాయి కాబట్టే గౌరవిస్తున్నారు. 
 
పదవులే లేకుంటే మిమ్మల్ని గంజిలో ఈగలా తీసిపడేసేటోళ్ళు" అని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన కాలిగోటికి సరిపోనోళ్లు, ఎగిరెగిరి మాట్లాడుతున్నోళ్లు దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని ఆయన హితవు పలికారు.