1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (22:52 IST)

టైమిస్తే ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా: కేటీఆర్‌కు ఏపీ మంత్రి రోజా కౌంటర్

rk roja
ఏపీలో కరెంటు లేదనీ, నీళ్లు లేవనీ, రోడ్లన్నీ అధ్వాన్నంగా వున్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా కౌంటరిచ్చారు. కేటీఆర్ గారు సమయమిస్తే... ఏపీలో జరిగిన అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా తిప్పి చూపిస్తానంటూ పేర్కొన్నారు.
 
 
ఏపీలో జరిగిన అభివృద్ధిని చూస్తే తెలంగాణలో కూడా అలాంటి ఫార్ములానే ఫాలో కావాలని తన మనసు మార్చుకుంటారని చెప్పుకొచ్చారు. వేసవి కారణంగా కరెంటు సమస్యలు చాలా రాష్ట్రాల్లో తలెత్తాయనీ, తెలంగాణలోనూ ఇదే సమస్య వున్నదంటూ ఆమె అన్నారు. కాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసారు రోజా.

 
ఏపీలో నరకంలో వున్నట్లుందంటున్నారు: కేటీఆర్
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని, బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు.

 
శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని, దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని, నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు.