1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:18 IST)

సజ్జనార్‌పై ఏకంగా 2 గంటలపాటు 45 ప్రశ్నలు.. అలా చెప్పడం కరెక్టేనా?

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు, ప్రత్యక్ష సాక్షులను విచారించిన కమిటీ కొద్దిరోజులుగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను విచారిస్తోంది. దిశ ఘటన జరిగిన సమయంలో ఆయన సైబరాబాద్ కమిషనర్‌గా ఉండటంతో ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 
 
అయితే కమిటీ ముందు విచారణకు హాజరైన సజ్జనార్ పలు కీలక విషయాలు వెల్లడించారు. దిశ హత్యాచార కేసు దర్యాప్తుతో తనకెలాంటి సంబంధం లేదని, ఆ కేసు విచారణను తాను పర్యవేక్షించలేదని ఆయన కమిటీ ముందుకు వాంగ్మూలం ఇచ్చారు. హైకోర్టు ప్రాంగణంలో దిశ నిందితుల కేసు విచారణ సోమవారం జరిగింది.
 
‘‘దిశ హత్యాచార కేసు దర్యాప్తుతో నాకెలాంటి సంబంధం లేదు. ఆ కేసు విచారణను నేనెప్పుడూ పర్యవేక్షించలేదు. నాకు ఎప్పటికప్పుడు వివరాలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ప్రత్యేక బృందాలు సమాచారం ఇవ్వలేదు. దిశ హత్యచార కేసు విచారణను పూర్తిగా శంషాబాద్‌ డీసీపీ పర్యవేక్షించారు. ప్రతి రోజూ ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో కేసు స్టేటస్‌ను మాత్రమే నాకు చెప్పారు’ అని సజ్జనార్ సోమవారం దిశ విచారణ కమిషన్‌కు వాంగ్మూలమిచ్చారు. సైబరాబాద్‌ చాలా పెద్ద కమిషనరేట్‌ అని, శాంతిభద్రతల పర్యవేక్షణకు తాను ఇన్‌ఛార్జినని, అన్ని కేసులను తానొక్కడినే పర్యవేక్షించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు.
 
అయితే ఒక సీనియర్‌ పోలీసు అధికారి అయ్యి ఉండి అలా చెప్పడం కరెక్టేనా? అంటూ సజ్జనార్‌పై కమిషన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సజ్జనార్‌తో పాటు షాద్‌నగర్‌ జడ్జి శ్యామ్‌ప్రసాద్‌ వాంగ్మూలాన్ని సైతం దిశ కమిషన్‌ నమోదు చేసింది. 
 
సజ్జనార్‌పై ఏకంగా 2 గంటలపాటు 45 ప్రశ్నలను సంధించింది. దిశ కేసు నిందితులను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని 2019 నవంబరు 29 సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ డీసీపీ ఫోన్‌లో చెప్పారని సజ్జనార్‌ వివరించగా కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.