1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:56 IST)

హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు.. ఉచిత ప్రయాణం

double decker bus
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి పలు పర్యాటక ప్రాంతాలను చుట్టుకుని వచ్చేలా నడుపనున్నారు. ఈ బస్సులు తిరిగే రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎం‌డీఏ కమిషనర్ అరవింద్ కుమార్ బుధవారం ఓ ట్వీట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. మొత్తం రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. 
 
ఇపుడు ఈ బస్సుులు తిరిగే మార్గాలను ఎంపిక చేశారు. ఈ బస్సులు ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా మార్గాల్లో నడుపనున్నారు. ఉదయం ట్యాంక్‌ బండ్‌ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్‌ కోసం ఖైరతాబాద్‌ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటుచేశారు.
 
అయితే, తొలుత ఈ బస్సులను ప్రయోగాత్మకంగా నడుపనున్నారు. ఆ సమయంలో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. కొన్ని రోజుల తర్వాత కనీస చార్జీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉందని, ఎప్పటి నుంచి ప్రయాణ టిక్కెట్‌ను అందుబాటులోకి తీసుకుని రావాలన్న విషయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.