1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (12:49 IST)

భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్ బస్సులు.. 50లోపు బస్సులు..

Double decker buses
నిజాం కాలం నాటి నుంచి భాగ్యనగరంలో డబుల్‌ డెక్కర్ బస్సులు తిరిగి రానున్నాయి. నగరంలోని ప్రముఖ కట్టడాలను వీక్షించేలా నగరవాసుల అవసరాలకు అనుగుణంగా బస్సుల రూపురేఖలను మారుస్తున్నట్లు తెలుస్తోంది. 50లోపు బస్సులను అన్ని ప్రధాన రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ సిద్దమవుతోందట. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే నివేదికను రూపొందించినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే కోఠి-పటాన్‌చెరువు, మెహిదీపట్నం-సికింద్రాబాద్ రూట్లలో ఈ బస్సులను నడిపించే అవకాశాలపై అధికారులు పరిశీలిన చేస్తున్నారు. కాగా, బస్సుల సంఖ్య, ఆదాయ వ్యయాలు, ఇతర అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
 
అయితే పెరిగిన రద్దీ దృష్ట్యా నగరంలో పైవంతెనలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తెలుగుతల్లి వంటి ఫ్లైఓవర్‌ లాంటి ప్రాంతంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగే ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు.
 
మహానగరంలో బస్సుల ద్వారా ఆదాయం పెంచేందుకు అధికారులు ఇప్పటికే రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాల మీదుగా డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. 
 
అందుకోసం బస్సుల నమూనాలు సిద్ధం చేస్తున్నారు. వాటిని మెట్రోస్టేషన్లతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థుల విజ్ఞానయాత్రలు, స్టడీ టూర్లకు అనుకూలంగా ఉండేలా డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.