శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (08:48 IST)

టీఎస్ ఆర్టీసీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)గా ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు ఆకర్షించేలా పలు రాయితీలు కల్పిస్తున్నారు. తాజాగా మరో వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 
 
శబరిమలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్టయితే ఐదుగురికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. అయ్యప్పభక్తులకు తక్కువ చార్జీలతో బస్సును అద్దెకు ఇవ్వడంతో పాటు ప్రతి బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌ ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. 
 
అలాగే, 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.48.96 వసూలు చేస్తారు. అలాగే, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.52.43 చొప్పున చార్జీలను నిర్ణయించింది. ఈ బస్సులను కావాల్సిన అయ్యభక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపోలు లేదా బస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరింది. 
 
కాగా, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తుంది. అతేకాకుండా ఏదేని కార్యానికి ఒకే కాలనీవారు బస్సును బుక్ చేసుకుంటే వారి కాలనీకే బస్సు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఎండీ సజ్జనార్ ప్రకటంచిన విషయం తెల్సిందే.