శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (18:38 IST)

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా తమ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అను హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో ప్రజలు మధుమేహవ్యాధి బారినపడుతున్న‌ట్లు పేర్కొన్నారు.

అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంభించడం ద్వారా షుగర్ వ్యాధి బారినపడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సంతులిత ఆహారం తీసుకోవడం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా చక్కెర వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు. షుగర్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు షుగర్ వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మధుమేహం కారణంగా దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

షుగర్ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే దుష్ప్రభావాలను సులువుగా అధిగమించవచ్చని చెప్పారు. డయాబెటిస్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా రక్తంలో గ్లూకోజ్ శాతం నిర్ధారణ (ఆర్.బి.ఎస్) పరీక్షలతో పాటు, కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం డయాబెటిక్ కాంప్లికేషన్స్, డయాబెటిక్ ఫుట్ పేరిట రెండు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

ఈ వైద్య శిబిరంలో కస్టమైజ్డ్ డయాబెటిక్ ఫుట్ వేర్ లభిస్తాయని ప్రకటించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని అను మై బేబీ హాస్పిటల్ నందు గర్భిణుల కోసం నాలుగు వేల రూపాయల విలువైన జెస్టేషనల్ డయాబెటిక్ ప్యాకేజీని కేవలం రూ.999లకే అందిస్తున్నామని అన్నారు.

వారం రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా హెచ్.బి.ఎ1సి, జీటీటీ, యుఎస్జి అబ్దామిన్ పరీక్షలు, డయాబెటిక్, గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నామని డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రిజ్వాన్ సయ్యద్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసన్ పేరూరి, జనరల్ సర్జన్ డాక్టర్ సిద్దార్థ్ పాల్గొన్నారు.