బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (09:30 IST)

గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలా.. దొరికితే ట్రంప్‌ను కూడా తీసుకొచ్చేవారేమో : అససుద్దీన్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రావడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలా అంటూ మండిపడ్డారు. దొరికితే డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చేవారేమో అంటూ సెటైర్లు వేశారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసిన విషయం తెల్సిందే. ఎంఐఎం పార్టీ తన చివరి బహిరంగ సభను హైదరాబాద్ పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో జరిగింది. ఇందులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతరాజకీయాలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం హైదరాబాదుకు ఇచ్చిందేమీ లేదని అన్నారు.
 
ఎంఐఎంను ఎదుర్కొనడానికి బీజేపీ అగ్రనేతలు బారులు తీరారని, యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీ, ఆదివారం అమిత్ షా వచ్చారని ఎద్దేవా చేశారు. రోహింగ్యాల లెక్కలు నన్ను అడిగితే ఎట్లా... మీరే తెలుసుకుని చెప్పండంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
 
"గల్లీ ఎన్నికలకు కూడా ఢిల్లీ నేతలు రావడం హాస్యాస్పదంగా ఉంది. ఓ చిన్న పిల్లవాడు నాతో ఇలా అన్నాడు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప అందరూ వచ్చారు అని వ్యాఖ్యానించాడు. ఆ పిల్లవాడి వ్యాఖ్యలు నిజమే అనిపించింది... దొరికితే ట్రంప్‌ను కూడా తీసుకువచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించేవాళ్లు" అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.