గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (11:28 IST)

ఇంత నిర్లక్ష్యమా..? కరోనా రోగుల మృతదేహాల్ని కుక్కలు పీక్కుతింటున్నాయ్..!

కరోనా రోగుల మృతదేహాల పట్ల జీహెచ్ఎంసీ అధికారుల నిర్ల్యక్ష్యం చేస్తున్నారు. హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటుచేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున్న కుక్కలు మృతుడి శరీర భాగాలను పీక్కుతింటున్నాయి. దీనికి కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్ల్యక్షమే అనే ఆరోపణలు వస్తున్నాయి.
 
కోవిడ్‌తో మరణించిన వారి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడి ఆత్మీయులు చనిపోయినా చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉంటుండటంతో.. అంత్యక్రియలను కూడా మున్సిపాలిటీ సిబ్బంది చేస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం లేకుండా కరోనా మృతదేహాలను గుంతల్లోకి విసిరేస్తున్న వీడియోలు ఇటీవలే బయటకొచ్చాయి. ఇప్పుడు సగం కాలిన మృతదేహాల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌తో ఆత్మీయులు చనిపోయి కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉండగా, వారిని మరింత క్షోభ పెట్టేలా సిబ్బంది అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అంతిమ సంస్కారాలైనా సరైన పద్ధతిలో నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
 
కాగా.. చనిపోయిన వారి వివరాలను నమోదు చేయడం, అంత్యక్రియలు నిర్వహించడం వంటివి జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం శ్మశాన వాటికలో సిబ్బందిని కూడా నియమించింది. కానీ కరోనా పేషెంట్ల మృతదేహాలు సరిగా కాలకపోయినా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఓ వ్యక్తి తన తాతయ్య అస్థికల కోసం శ్మశానానికి రాగా సగం కాలిన డెడ్ బాడీలను కుక్కలు పీక్కుతినడం చూసి షాకయ్యాడు. కాగా, మృతదేహాలు పూర్తిగా కాలే వరకూ చూడాల్సిన బాధ్యత మాది కాదంటే మాది కాదని శ్మశాన వాటిక నిర్వాహాకులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు.