1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (16:16 IST)

తల్లిదండ్రులు ట్యూషన్‌కు పంపిన పాపం.. ఆ యువతికి శాపంగా మారింది..

తల్లిదండ్రులు ట్యూషన్ కోసం పంపిస్తే.. ఆమె ట్యూషన్ మాస్టార్‌నే ప్రేమించింది. చివరికి అతడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపం చెందిన యువతి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నతోకట్టా తిరుమల అపార్ట్‌మెంట్‌ వాసి నర్సింహులు కూతురు శైలజ(23) బీటెక్‌ చదువుతోంది.
 
శైలజ ఫ్యామిలీ ఉండే ఎదురు ఫ్లాట్‌లో పవన్ అలియాస్ సన్నీ(25) నివాసం ఉండేవాడు. అతడు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలోనే శైలజ, పవన్‌లు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని శైలజ ఇంట్లో చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు.. ఈ విషయంపై పవన్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా శైలజ తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఇందుకు పవన్ తల్లిదండ్రులు నో చెప్పారు. ఆ తర్వాత శైలజ తల్లిదండ్రులను కులం పేరుతో దూషించారు.
 
ఇది జరిగిన కొద్ది రోజులకు పవన్.. శైలజ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ మాటలతో శైలజ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి.. శైలజ ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజ పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి శైలజ తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.