1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

కోస్తాంధ్రపై ద్రోణి.. తెలంగాణాలో నేడు రేపు వర్షాలు

కోస్తాంధ్రపై ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో ఆదివారం భారీగా, సోమవారం ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
 
నారాయణపేట జిల్లాలోని మాగనూర్‌లో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వికారాబాద్ మండలంలోని కొటాలగూడ శివారులో నిన్న సాయంత్రం పిడుగు పడి అదే గ్రామానికి చెందిన 38 ఏళ్ల దాసు అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
 
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాగోల్, కోఠి, నాచారం, హబ్సీగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, జియా గూడ, ఎల్బీనగర్, టోలీ చౌకి, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కాప్రా, సికింద్రాబాద్, తార్నాక, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఓయూ ఏరియా, ఉప్పల్, కోఠి ప్రాంతాల్లో వర్షం పడింది. 
 
దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో, రోడ్లపై నీరు నిలిచింది. పలు చోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనుల్లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.