1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:41 IST)

మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నా : వైఎస్. షర్మిల

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమైపోయింది. ఆ దిశగా ఆమె ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె పలు జిల్లాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం పలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలల నుంచి వచ్చి వందలాది మంది విద్యర్థులతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో భేటీ అయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగు ప్రజలను దివంగత వైయస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. ఆయన హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి రూపాయలు కడితే, మిగతా ఫీజును ప్రభుత్వం భరించేదని  గుర్తుచేశారు. అప్పుడు చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. 
 
అలాంటి వారంతా తన తండ్రి వైఎస్ఆర్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నారు. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన తండ్రి ఉన్న సమయంలో ప్రతి జిల్లాకు ఓ విశ్వవిద్యాలయం తీసుకొచ్చారన్నారు.
 
ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని... ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాల్సి ఉందన్నారు. మీ అక్కగా ఈ సమాజాన్ని బాగు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
 
మరోవైపు మాజీ మంత్రి ప్రభాకర్ రెడ్డి కూడా షర్మిల పార్టీలో చేరబోతున్నారు. ఇటీవల షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మంగళవారం ప్రభాకర్ రెడ్డిని కలిశారు. షర్మిల సమీప బంధువు కూడా ఈ సందర్భంగా వారితో పాటు ఉన్నారు.