శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (07:38 IST)

కేసీఆర్ డెడ్‌లైన్.. విధుల్లో చేరింది ఎంతమంది?

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతధంగా కొనసాగుతోంది. అయితే ఇవాళ అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాత్రి 12 గంటలోపు కార్మికులు చేరని పక్షంలో మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తాం అని సీఎం ప్రకటించారు.
 
ఈ డెడ్‌లైన్ వల్ల ఇప్పటివరకు 208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి డెడ్‌లైన్ విధించగా.. 3వ తారీఖున 17 మంది, 4 వ తేదీన ఆ సంఖ్య 34కు చేరుకోగా.. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది సదరు డిపోల వద్ద దరఖాస్తులను అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు.
 
సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ అర్ధరాత్రి వరకు సీఎం కెసిఆర్ విధులలో చేరేందుకు గడువు విధించినా మొత్తం దాదాపు యాభై వేలమంది ఉన్న ఆర్టీసీలో ఇప్పటివరకు మూడు వందలకు మించని సంఖ్యే విధులకు చేరింది.

అందులో దాదాపు సగం మంది వచ్చే నెలలో రెటైర్ల్ అయ్యే వాళ్ళు కాగా మిగతా సగం మంది బస్ భవన్ లో పనిచేసే వాళ్లేనని తెలుస్తుంది. మరి గడువు తర్వాత సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.
 
టీఎస్‌ ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి..? 
గడువు ముగిసినా కార్మికులెవరూ విధుల్లో చేరకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు నిన్న అర్థరాత్రితో ముగిసింది.

అయితే, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విధుల్లో చేరడానికి కార్మికులు ముందుకు రాలేదు. గడువు ముగిసే సమయానికి 350 మంది వరకు కార్మికులు మాత్రమే సమ్మతి పత్రాలు ఇచ్చినట్టు సమాచారం. విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ రాత్రి 12 గంటలకు వరకు అందిన దరఖాస్తులను జిల్లాల నుంచి డిపోల వారీగా సేకరించి ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

విధుల్లో చేరడానికి ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య ఆధారంగా ఎన్ని రూట్లను ప్రైవేటీకరించాలనే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విధుల్లో చేరే వారిని మినహాయించి మిగిలిన రూట్లను ప్రైవేట్‌ పరం చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు కార్మిక సంఘాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. తామంతా ఒకే మాట మీద నిలబడ్డామని చెబుతోంది. కార్మికులను బెదిరించినా లొంగడం లేదని జేఏసీ గుర్తు చేసింది. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, యువజన సంఘాలతో జేఏసీ సమావేశం నిర్వహించింది.

సమ్మెను కొనసాగించాల్సిందేనని, తాము కార్మికుల వెంటే ఉంటామని అఖిలపక్ష నేతలు హామీ ఇచ్చారు. ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చర్చల ద్వారా కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలనే తాము కోరుతున్నామని చెప్పారు.

ఆర్టీసీని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చెల్లదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
 
30న హైదరాబాద్​లో ప్రజా తిరుగుబాటు మార్చ్
ఈ నెల 30న హైదరాబాద్​లో ప్రజా తిరుగుబాటు మార్చ్ నిర్వహించనున్నట్లు విద్యానగర్​లో విపక్షనేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 30న హైదరాబాద్‌లో ప్రజా తిరుగుబాటు మార్చ్‌ నిర్వహించనున్నట్లు విపక్ష నేతలు ప్రకటించారు.

విద్యానగర్‌లో విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నిర్ణయాలు పాటిస్తూనే ఉద్యమం ద్వారా ఆర్టీసీని పరిరక్షించుకుంటామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజా, న్యాయవ్యవస్థ అగ్రహానికి గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు. కార్మికులను మంత్రులతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.