మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:12 IST)

మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు: కేసీఆర్ నిప్పులు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా-రైతు-కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరుకు టిఆర్ఎస్ చొరవ తీసుకుని, సిద్ధమవుతున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు.

కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం గడిచిన ఆరున్నరేళ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిష్క్రియా పరత్వ రాజకీయాల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని సిఎం అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా ఆ  సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నదని సిఎం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. 

టిఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, జిహెచ్ఎంసి డివిజన్ ఇంచార్జిల సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. సమావేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని, టిఆర్ఎస్ సంసిద్ధతను కేసీఆర్ వివరించారు. 

‘‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రజల కోసం ఏదీ చేయకుండా అన్నీ చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతున్నది. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.

అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజలను చైతన్య పరిచి బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు. 

‘‘నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటి దాకా ప్రజల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. చెప్పుకోవడానికి వారికి ఒక్క విషయమూ లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కాశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు. ప్రజలను మత పరంగా విభజించే ప్రయత్నం చేస్తారు.

మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. అంతే తప్ప దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్క పని చేయలేదు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిల పడతారు.  ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు.

బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొడతారు తప్ప వాస్తవానికి ఏ పని చేయరు.  గులకరాల్ల డబ్బాను ఊపినట్లు వాళ్ల ప్రచారం ఉంటుంది’’ అని కేసీఆర్ విమర్శించారు. 

‘‘దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో దూర దృష్టితో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. కానీ బిజెపి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, పెట్టుబడులను ఉప సంహరించుకుని, వాటిని ప్రైవేటు-కార్పోరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ అనే ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు.

వాజ్ పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. అరుణ్ శౌరిని దానికి మంత్రిని చేశారు. మొదటి సారిగా వాజ్ పేయి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉప సంహరించుకున్నది. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని బిజెపి విధానాలను కొనసాగించింది.

ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. తద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేటు కంపెనీలకు అప్పగిస్తున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించక పోగా ఉన్న వాటిని మూసి వేసే ప్రయత్నం చేస్తున్నది. దీని వల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరో వైపు అందులో పని చేస్తున్న లక్షలాది  మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే, ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ, 65 వేల కిలోమీటర్ల నెట్ వర్క్ భారతీయ రైల్వేలకు ఉంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది.

ప్రతి రోజు కోట్లాది మందికి సేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో కూడా రైల్వేలు సేవలు అందించాయి. అలాంటి రైల్వేలను ప్రైవేటు పరం చేసే అవసరం ఏమొచ్చింది? రైల్వే స్టేషన్ లో ఛాయి అమ్మిన అని చెప్పిన మోడీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 

‘‘దేశానికే గర్వ కారణమైన సంస్థల్లో భారత జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. బంగారు బాతు లాంటిది. 40 కోట్ల మంది పాలసీ దారులు, 30 లక్షల కోట్ల ఆస్తి కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు నిధులు కూడా సమకూరుస్తోంది. 2020-21 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎల్.ఐ.సి. డివిడెంట్ 2,600 కోట్ల రూపాయలుగా చూపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా పథకాన్ని ఎల్.ఐ.సి. గొప్పగా అమలు చేస్తున్నది. కేవలం పది రోజుల్లోనే పరిహారం అందిస్తున్నది. ఇంతటి ప్రాముఖ్యత, ఆవశ్యకత ఉన్న ఎల్.ఐ.సి.ని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎల్.ఐ.సి. లాభాలు గడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభం ? ఆ కంపెనీలు తమ లాభాలను ఎక్కడికి తరలిస్తాయో కూడా తెలియదు’’ అని సిఎం కేసీఆర్ విమర్శించారు.

‘‘రైల్వేలు, ఎల్.ఐ.సి.తో పాటుగా విద్యుత్ సంస్థలైన ఎన్.టి.పి.సి., బి.హెచ్.ఇ.ఎల్; బి.ఎస్.ఎన్.ఎల్., డిఫెన్స్, బిపిసిఎల్ లాంటి నవతర్నాలుగా చెప్పే ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగం సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా వాటిని కార్పోరేట్ సంస్థలకు నరేంద్ర మోడి ప్రభుత్వం అప్పగిస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దేశంలోని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని నరేంద్ర మోడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది’’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు.
 
కేంద్రంలో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్ల దేశంలో అభివృద్ధి కుంటుపడింది. దేశ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటే, కేవలం 2.20 లక్షల మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. ఇంకా రెండు లక్షల మెగావాట్లను వినియోగించుకోలేకపోతున్నాం.

దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు అందుబాటులో ఉంటే వాటినీ వినియోగించుకోలేకపోతున్నాం. ఇంకా దేశంలో ప్రజలు మంచినీటి కోసం, సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఉన్న నీటిని వినియోగించుకునే తెలివి లేదు. దేశ జిడిపి వృద్ధిరేటు మైనస్ 24కు తగ్గింది. పెరుగుతుంది అనుకున్న దానితో కలుపుకుంటే దేశ జిడిపి మొత్తంగా 31 శాతం తగ్గింది. జిడిపి పెరుగుదల శాతంలో భారతదేశం కన్నా బంగ్లాదేశ్, శ్రీలంక ముందున్నాయి.

మోడీ ప్రభుత్వం ఇంకా కొనసాగితే, నేపాల్ కూడా భారతదేశాన్ని దాటిపోయే అవకాశం ఉంది. 1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జిడిపి ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. కానీ భారతదేశం కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల, తెలివిలేని తనం వల్ల, విధానాలను రూపొందించే శక్తి లేకపోవడం వల్ల వెనక్కి పోతున్నది’’ అని సిఎం కేసీఆర్ విమర్శించారు. 

‘‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదని అర్థమైపోయింది. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి అన్యాయం చేస్తున్నది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజిస్తున్నది. ప్రజల్లో భావేద్వేగాలను పెంపొందించి రాజకీయ లబ్ది పొందుతున్నది. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. దేశానికి ఈ పద్ధతి ఉపయోడపడేది కాదు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. దేశంలో టెర్రరిజం వచ్చింది. నక్సలిజం వచ్చింది. కానీ మార్పు మాత్రం రాలేదు. గరీభీ హటావో అనే నినాదాలు వచ్చాయి తప్ప పేదరికం పోలేదు. కాంగ్రెస్, బిజెపి లు బడేభాయ్ వెంట చోటే భాయ్ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యారు. కాబట్టీ దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది.

బిజెపి విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. నేను ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డిఎంకె నేత స్టాలిన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్ సింగ్ బాదల్, కుమారస్వామి, సిపిఐ, సిపిఎం నాయకులతో మాట్లాడాను.

దేశ వ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషంయలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.