1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పోకిరి ప్రేమ వేధింపులు - యువతి బలవన్మరణం

ఓ పోకిరి చేస్తున్న ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో 15 యేళ్ళ చిరు ప్రాయంలోనే అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. 
 
పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బడికి వెళ్లే దారిలోనే నివాసముండే సాయికృష్ణ(20) అనే యువకుడు ప్రేమించాలంటూ ఆమెను వేధిస్తుండేవాడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో యువకుడిని మందలించారు. 
 
అయినా ప్రవర్తనను మార్చుకోని సాయికృష్ణ ఈ నెల 9న బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా వెంటబడ్డాడు. ప్రేమించకుంటే చచ్చిపోతానంటూ బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆమె దారిలో కలిసిన బంధువులకు వేధింపుల విషయాన్ని చెప్పి ఇంటికి వెళ్లింది. 
 
ఆ సమయంలో కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.