శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (09:17 IST)

తెరాస నేతను నిలబెట్టి కాల్చి చంపిన మావోయిస్టులు...

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇటీవలికాలంలో మావో కార్యక్రమాలు జోరందుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో గ్రేహౌండ్స్ దళాలు కూంబింబ్ ఆపరేషన్లు నిర్వహించాయి. అదేసమయంలో పోలీసులు జరిపిన ఈ తనిఖీల్లో మావో ప్రముఖ నేతలు తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ కూడా మావో ప్రభావిత జిల్లాల్లో మకాం వేశారు. 
 
ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక తెరాస నేత భీమేశ్వరరావును దారుణంగా కాల్చి చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమేశ్వరరావు ఇంట్లోకి జొరబడిన ఆరుగురు మావోయిస్టులు, ఆయనను తొలుత బయటకు లాక్కొచ్చారు.
 
ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్‌ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.