1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (17:33 IST)

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా ఉంది.. ఎమ్మెల్సీ కె.కవిత

kavitha
గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా తనను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు.

ఇదే అంశంపై ఆమె గురువారం ఒక సుధీర్ఘ ప్రకటన చేశారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తర్వాత తోక ముడిచారు.

మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని,కేసీఆర్‌ని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది. ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల ఇది అత్యంత దురదృష్టకరమని ఆమె విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.,

పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బిఆర్‌యస్ పార్టీ‌పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం గ్రహించాలి.. జాగ్రత్త పడాలి అని పిలుపునిచ్చారు.