1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:25 IST)

షేక్‌పేట పారామౌంట్‌లో విషాదం... విద్యుదాఘాతానికి ముగ్గురు యువకుల మృతి

youths
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట పారామౌంట్‌ కాలనీలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి అన్నదమ్ములతో పాటు వారి స్నేహితుడు కూడా మృత్యువాతపడ్డారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... అనస్‌ (19) తమ ఇంట్లో ఉన్న మోటారు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు యత్నించగా కరెంట్‌ షాక్ కొట్టింది.
 
దీన్ని గమనించిన రిజ్వాన్‌ (18) తన అన్నను కాపాడేందుకు యత్నించగా అతడికి కూడా షాక్ తగిలింది. అన్నదమ్ములను రక్షించేందుకు పక్కనే ఉన్న స్నేహితుడు రజాక్‌ (16) ప్రయత్నించగా ప్రమాదవశాత్తు అతడు కూడా షాక్‌కి గురయ్యాడు. దీంతో ఈ ముగ్గురూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.