1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (20:49 IST)

స్మార్ట్ ఫోన్ కొనివ్వకపోవడంతో తల్లినే చంపేశాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవట్లేదు చాలామంది. అదీ కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగట్లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్‌లకు అలవాటయ్యారు. ఆ అలవాటే ఓ యువకుడిని నేరస్థుడిగా మార్చింది. 
 
సెల్ ఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రోకలితో తలపై కొట్టి మరీ అంతమొందించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు.  
 
ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. కానీ స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.