గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (16:23 IST)

మూడేళ్ల చిన్నారిని చంపేసిన రెండు పాములు... ఎలా?

Snake
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. రెండు పాములు కలిసి మూడేళ్ల చిన్నారిని చంపేశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్‌, హర్షిత దంపతులకు కుమారుడు రుద్రాన్ష్ (రెండున్నర ఏళ్లు), మూడు నెలల కూతురు ఉన్నారు. ఇటీవలి వర్షాలకు వారి ఇంట్లోని ఓ గది కూలిపోయింది. 
 
దీంతో శుక్రవారం తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పైనుంచి రెండు పాములు ఒకేసారి మంచంపై నిద్రిస్తున్న రుద్రాన్ష్‌పై పడింది. బాలుడి చేతికి చుట్టుకుని కాటేశాయి. కుమారుడు ఏడవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు పాములను లాగి చంపేశారు.
 
ఆ తర్వాత హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. పాము కాటుకు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.