మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జులై 2023 (10:39 IST)

సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుందని రోకలిబండతో మోది చెల్లెలి హత్య ... ఎక్కడ?

sanghavi
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఓ దారుణం జరిగింది. పొద్దస్తమానం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుందని ఆగ్రహించిన ఓ సోదరుడు.. సొంత చెల్లిని రోకలి బండతో మోది చంపేశాడు. ఆ తర్వాత రాయి తగలడంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులు పిలవడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇల్లెందు మండలంలోని రాజీవ్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తున్న సింధు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇది సోదరుడికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో చెల్లితో తరచూ గొడవపడుతున్నాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 
 
ఈ క్రమంలో హరిలాల్ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ తీసుకెళ్తుండగా మృతిచెందారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.