శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:23 IST)

బంగారు కాదు.. బలి తెలంగాణ: సంజయ్‌

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ మృతికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘బంగారు తెలంగాణ అన్నావ్‌.. బలి తెలంగాణను చేశావ్‌’ అని ఘాటుగా విమర్శించారు.

శుక్రవారం రాత్రి సునీల్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్తున్న సంజయ్‌ని భూపాలపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. సునీల్‌నాయక్‌ మృతదేహానికి గన్‌పార్కు వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం నిరాకరించడం దారుణమన్నారు.

సునీల్‌ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ రూ.లక్ష సహాయం ప్రకటించటం సిగ్గుచేటని విమర్శించారు. సునీల్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆయన సోదరుడు శ్రీనివా్‌సకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉదయం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద సునీల్‌ కుటుంబ సభ్యుల్ని సంజయ్‌ పరామర్శించారు. సునీల్‌ ఆత్మహత్య.. నిరుద్యోగుల పట్ల టీఆర్‌ఎస్‌ సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.