గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (11:06 IST)

పెను భారాన్ని భరించలేం.. బస్సు చార్జీలు పెంచాల్సిందే : తెలంగాణ ఆర్టీసీ

కరోనా వైరస్‌తో పాటు.. పెరిగిన డీజల్ ధరల కారణంగా ఆర్టీసీపై పెనుభారం పడిందనీ, దీన్ని భరించే స్థితిలో ఆర్టీసీ లేదని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడింది. అందువల్ల ఆర్టీసీ చార్జీలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. 
 
గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలు, కరోనాతో విధించిన లాక్డౌన్‌, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల సంస్థ నష్టాలు కొనసాగుతున్నాయన్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు పెంచితే సంస్థపై మరింత ఆర్థికభారం పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్దఎత్తున సహాయమందించడం, బస్సు చార్జీలు పెంచడంలాంటి చర్యలు తీసుకుంటే తప్ప సంస్థపై ఆర్థికభారం తగ్గే అవకాశమే లేదని సీఎం కేసీఆర్‌కు వివరించారు. 
 
ముఖ్యంగా, గతంలో లీటర్ డిజిల్ ధర రూ.67గా ఉండేదని, ఇపుడది రూ.80 వరకు చేరిందన్నారు. అంటే స్వల్ప వ్యవధిలోనే రూ.15 అదనంగా పెరగడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పైగా, లాక్డౌన్‌ సమయంలోనూ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు భారంగా మారాయి. ఒకవేళ ఉద్యోగుల జీతాలు కూడా పెంచితే మరింత భారం తప్పదని వివరించారు.
 
ఈ పరిస్థితుల్లో పెనుభారాన్ని భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. రాష్ట్ర ప్రభుత్వమే పెద్దఎత్తున ఆర్టీసీకి సహాయం అందించడంతోపాటు, బస్సుచార్జీలు పెంచితేనే సంస్థ గట్టెక్కే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. 
 
ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో 50 శాతం మాత్రమే నడుపుతున్న సిటీ బస్సుల సంఖ్యను 75 శాతానికి పెంచుకోవచ్చని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బస్సులు తక్కువగా ఉండటంతో నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిసంఖ్యను పెంచుకొనేందుకు అవకాశమివ్వాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. స్పందించిన సీఎం సిటీ బస్సులను 75 శాతం తిప్పుకోవాలని అధికారులకు సూచించారు.