1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (12:28 IST)

కాల్ సెంటర్ ఉద్యోగినులే టార్గెట్.. వ్యభిచార కూపంలో అలా దించేస్తారు..

కాల్ సెంటర్ ఉద్యోగినులే వారి టార్గెట్. వారికి గాలం వేస్తారు. మాయ మాటలు చెబుతారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకుంటారు. ఉపాధి కల్పిస్తామని ఆశ పెడతారు. వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంతే.. అడ్డంగా బుక్ అయినట్టే. వ్యభిచార కూపంలో చిక్కుకుంటారు. ఇలాంటి దురాఘతాలకు పాల్పడుతున్న ఓ ముఠాని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కాల్‌సెంటర్‌ ఉద్యోగినులను మాయ చేసి ఆన్‌లైన్‌ వ్యభిచార కూపంలో లాగిన ముఠా సభ్యులను బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
 
ఏపీలోని అన్నవరానికి చెందిన శివ అలియాస్‌ బడ్డి హైదరాబాద్ లో ఆన్‌లైన్‌ వ్యభిచార కలాపాలు నిర్వహిస్తున్నాడు. పోలవరం మండలానికి చెందిన ఓబిలిషెట్టి సతీష్‌ అలియాస్‌ నాని(28), సూర్యాపేట జిల్లా పాల్‌కిడు మండలం వాసి రామావత్‌ నాగేశ్వరరావు అలియాస్‌ చరణ్‌ నాయక్‌(30), మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన కరిడిగి మహేష్‌ గౌడ్‌ అలియాస్‌ మహేష్‌(31)తో శివ జత కలిశాడు. 
 
అంతా కలిసి ఏడాదిగా జల్‌పల్లి శివారులోని నక్షత్ర విలాస్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశాడు. దాని ద్వారా అమ్మాయిలను సమకూరుస్తారు. ముందుగానే డబ్బు తీసుకుంటారు.
 
ఈ విషయం పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. శివతో ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ అయ్యారు. తమకు యువతి కావాలన్నారు. సరేనన్న శివ.. బేరం కుదుర్చుకున్నాడు. 
 
తన గ్యాంగ్ కి చెందిన ముగ్గురితో యువతిని కారులో చెప్పిన చోటుకు పంపాడు. అప్పటికే అక్కడ మాటేసిన పోలీసులు.. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా ఆన్‌లైన్‌ దందా గుట్టురట్టు చేశారు. నక్షత్ర విలాస్‌కి వెళ్లిన పోలీసులు మరో ఇద్దరు యువతులను రక్షించారు.
 
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తమను ముఠా సభ్యులు వ్యభిచార కూపంలోకి దింపారని యువతులు వాపోయారు. అమ్మాయిలను కూకట్‌పల్లిలోని హోమ్‌కి తరలించారు పోలీసులు. 
 
ఇంకా ఎంతమందిని ఇలా ఈ ఉచ్చులోకి లాగారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.