గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (16:58 IST)

క్రమశిక్షణ తప్పిన గురువు.. టవల్‌తో ఆన్‌లైన్ క్లాసుల బోధన.. చివరకు..

చెన్నై నగరంలో పేరు మోసిన ఓ విద్యా సంస్థకు చెందిన ఉపాధ్యాయుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. క్రమశిక్షణతో పాఠాలు బోధించాల్సిన గురువురు క్రమశిక్షణ తప్పడు. తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఫలితంగా ఇపుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. 
 
చెన్నైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ క్లాస్ సమయంలో ఒంటిపై కేవలం టవల్ మాత్రమే కట్టుకుని క్లాస్‌లను బోధిస్తూ వచ్చాడు. ఆ ఉపాధ్యాయుడి చేష్టలతో విద్యార్థినిలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 
 
సదరు ఉపాధ్యాయుడు ఇప్పుడు మాత్రమే కాదు.. అనేకసార్లు ఇలా విద్యార్థినులతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించే వాడని బాధిత విద్యార్థినిలు వాపోయారు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అయితే, ప్రస్తుత విద్యార్థినిలే కాకుండా.. పూర్వ విద్యార్థినిలు కూడా ఆ కీచక ఉపాధ్యాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతేడాది ఆన్‌లైన్ క్లాస్‌ల సమయంలోనూ అతను ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. టవల్ పైనే పాఠ్యాంశాలు బోధించేవాడన్నారు. అంతేకాదు.. విద్యార్థినిల ఫోన్ నెంబర్లకు అసభ్యకరమైన మెజేస్‌లు పంపించేవాడన్నారు. 
 
ఉపాధ్యాయుడి అరాచకాలు మితిమీరడంతో పలువురు విద్యార్థినిలు సోషల్ మీడియా వేదికగా అతని అరాచకాలను బట్టబయలు చేశారు. అశ్లీలంగా బోధించిన వీడియో స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అతను పంపిన మెసేజ్‌ల తాలూకు స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్లను ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొన్న సింగర్ చిన్మయి, డీఎంకే ఎంపీ కనిమొళి సైతం షేర్ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
దీంతో స్పందించిన పోలీసులు.. ఆ కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టంలోని సెక్షన్ 12 సహా 67, 67(ఎ), 354(ఎ), 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి, జ్యూడీషియల్ కస్టడీకి పంపించారు. కాగా, ఉపాధ్యాయుడి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు.