శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (22:13 IST)

టీచర్ పనిష్మెంట్.. విద్యార్థిని ఆత్మహత్య... ఎక్కడంటే?

hang
సమయంలో తరగతి గదిలో టీచర్ విధించిన శిక్షకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి, బంజారా కాలనీకి చెందిన కరంటోతు అక్షయ (13) రాఘవేంద్ర నగర్‌లోని శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 
 
గురువారం స్కూలుకు వెళ్లిన అక్షయ, ఆమె స్నేహితురాలు రోజూ కూర్చునే చోట కాకుండా వేరే చోట కూర్చున్నారు. గమనించిన ఉపాధ్యాయుడు ప్లేస్ ఎందుకు మార్చారని ప్రశ్నిస్తూ తరగతి నుంచి బయటకు పంపి నిల్చోబెట్టారు. మరో టీచర్ లోపలికి వెళ్లమనడంతో లోపలికి వచ్చిన ఆ విద్యార్థులకు మళ్లీ వచ్చిన మొదటి ఉపాధ్యాయుడు పనిష్మెంట్ ఇచ్చారు. విద్యార్థులను లోపలికి వెళ్లమనలేదని మరో టీచర్ కూడా మాట మార్చడంతో బాలికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరినీ రెండు పిరియడ్ల పాటు బయట నిల్చోబెట్టారు.
 
సాయంత్రం బడి వదిలిపెట్టాక అక్షయ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు లక్పతి, సరిత ఊరెళ్లడంతో బాలిక ఒక్కతే ఉంది. దీంతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసి అక్షయ తల్లిదండ్రులు షాకయ్యారు.  
 
తన కుమార్తె మృతికి ఉపాధ్యాయుడే కారణమంటూ స్కూలుకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాల భవనం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.