శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:02 IST)

పాఠశాలల ముందు సెల్ఫీల కోసం కుస్తీ పడుతున్న టీచర్స్: వింతగా చూస్తున్న విద్యార్థులు

selfie
ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద విశ్వాసం పోయిందో ఏమోగానీ... పాఠశాలలకు వారు వచ్చినట్లుగా రూఢి చేసుకునేందుకు ఆగస్టు 16 నుంచి కొత్త యాప్ ఒకటి ప్రవేశపెట్టారు. ఏపీ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఇకపై స్కూలుకి ఉదయం 9 గంటల కంటే ముందే రావాలి. వచ్చినట్లుగా ధృవీకరించేందుకు తమ సెల్ ఫోనులో పాఠశాల ముందు నిలబడి సెల్ఫీ తీయాలి.

 
విద్యాశాఖ అందించిన యాప్ ద్వారా ముఖ కవళికలను గుర్తించడం ద్వారా ఆ రోజు ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు హాజరైనట్లు పరిగణిస్తారు. ఐతే 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆరోజు ఉపాధ్యాయుడు హాఫ్ డే లీవ్ తీసుకున్నట్లు పరిగణిస్తారు. మధ్యాహ్నం లోపుగా సెల్ఫీ తీసి యాప్ లో అప్ లోడ్ చేయకపోతే రోజుమొత్తం గైర్హాజరైనట్లే లెక్కకి వస్తుంది. దీనితో ఏపీలో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు.

 
మంగళవారం ఉదయం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు ఉపాధ్యాయులు సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. ఆ సెల్ఫీని యాప్ ద్వారా అప్ లోడ్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఎప్పుడూ గంభీరంగా  క్లాసులోకి అడుగుపెట్టే ఉపాధ్యాయులు స్కూలు ముందు ఇలా సెల్ఫీల కోసం ఫీట్లు చేయడాన్ని కొంతమంది విద్యార్థులు వింతగా చూస్తున్నారు.


కాగా ఈ సెల్ఫీలతో అటెండెన్స్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగిస్తుందని విమర్శిస్తున్నారు. కానీ విద్యాశాఖ మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయుల సెల్ఫీలు తప్పనిసరి అని తేల్చి చెపుతోంది.