1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (17:50 IST)

టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే సీనే లేదు.. రాహుల్ క్లారిటీ

Rahul Gandhi
Rahul Gandhi
టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదన్నారు. టీఆర్ఎస్-బీజేపీలతో లాలూచీ పడే నేతలు తమకొద్దన్నారు. 
 
టీఆర్ఎస్, కేసీఆర్‌తో పొత్తు, లోపాయికారీ ఒప్పందం పెట్టుకోవాలనుకునే నేతలు స్వచ్ఛందంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే తాము మెడపట్టుకుని తోసేస్తామని గట్టి హెచ్చరిక చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీని ఓడించి తీరుతామని.. ఇది కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధమని పేర్కొన్నారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అండగా, వారి సమస్యలపై పోరాడే నేతలకే టిక్కెట్లు ఇస్తామని రాహుల్‌గాంధీ వరంగల్ సభ సందర్భంగా తేల్చి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని.. వారి లాలూచీకి అదే నిదర్శనమన్నారు. 
 
తెలంగాణలో బీజేపీ గెలిచే దమ్ములేకే టీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటమే చేస్తుందని.. ఎవరితోనూ కలిసే ఉద్దేశం లేదన్నారు.