మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

తెలంగాణలో లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

ఉన్నత విద్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఆ శాఖలో త్వరలో జూనియర్‌, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, వివిధ వర్శిటీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించే దిశగా అడుగులు వేస్తోంది.

యూనివర్సిటీల్లో 1061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 936 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పనిలోపనిగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1200 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాష్ట్రంలోని 9 వర్సిటీలకు వైస్‌ చాన్సలర్‌లను నియమించిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు న్నాయి. వీసీల నియామకం కోసం ఇప్పటికే సెర్చ్‌ కమిటీలను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

నవంబర్‌ మొదటి వారంలో వీసీల నియామకం పూర్తికానున్న నేపథ్యంలో నవంబర్‌ చివరి వారం కానీ లేదా డిసెంబర్‌లో గానీ యూనివర్సిటీల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసి నియామకాల ప్రక్రియను 2019-20 విద్యా సంవత్సరంలోనే పూర్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు.

రాష్ట్రంలో 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 936 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నియామకాల ప్రక్రియకు సంబంధించి కొత్త జోనల్‌ వ్యవస్థ మూలంగా కొంత ఆలస్యం కానుంది. అయితే ఇప్పటికే కొత్త జోనల్‌ వ్యవస్థపై వివిధ శాఖల్లోని క్యాడర్‌ వారీగా ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది.

ఈ నేపథ్యంలో కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే డిగ్రీ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జారీ చేయనుంది.
 
404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1200 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నప్పటికీ అనుమతి రాలేదు.

కానీ ఈ ఏడాది విద్య శాఖ కార్యదర్శిగా బి జనార్దన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ లేఖ రాయాలని సూచించగా గతంలో ఉన్న ఇంటర్‌ విద్యశాఖ కమిషనర్‌ అశోక్‌ వివరాలతో సర్కార్‌కు లేఖ రాశారు.

ఆ తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ కూడా మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలో 6719 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు మంజూరైనాయి. వాటిలో ప్రస్తుతం 1040 పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్‌ జేఎల్‌లు కొనసాగుతున్నారు. 5679 జేఎల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వాటిలో 3728 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ పనిచేస్తున్నారు. వారు కాకుండా మరో 900 మంది గెస్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1200 జేఎల్‌ పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతి కోరుతూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. అనుమతి రాగానే భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు.