శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (17:39 IST)

అమరావతి గందరగోళం వల్ల తెలంగాణాకు ఆదాయం పెరిగింది : రేవంత్ రెడ్డి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని ఒక తెలంగాణ పౌరుడుగా అభినందిస్తున్నా.. ఒక దేశ పౌరుడుగా చింతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తన వాళ్లకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే అమరావతిలో గందరగోళం సృష్టించినట్టుగా ఉందన్నారు. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. ఫలితంగా ఆదాయం కూడా బాగా వస్తోందని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్‌ ఎప్పుడైనా మున్సిపాలిటీల్లో తనిఖీలు చేశారా? అంటూ నిలదీశారు. ప్రజా కోర్టు నిర్వహించడానికి కేటీఆర్‌ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆరేళ్లు అయినా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పూర్తికాలేదని విమర్శించారు. 
 
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల్ని మాటలతో మభ్యపెట్టి.. ఓట్లు వేయించుకుని తర్వాత మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ మున్సిపాలిటీలోనైనా మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చారా అని రేవంత్ నిలదీశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు అమలు చేయలేదని దుయ్యబట్టారు. హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారని ముందే చెప్పామని గుర్తుచేశారు. మందుబాబుల రక్తానికి తెలంగాణ ప్రభుత్వం రుచిమరిగిందని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.