శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 జనవరి 2022 (19:15 IST)

నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ కోసం సాంకేతికత అనేది మన ప్రాధమిక హక్కు

జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని  సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్‌ ప్రోగ్రెసివ్‌ అసోసియేషన్‌(ఆర్‌కెపీఏ), నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం కావడంతో పాటుగా నాణ్యమైన వ్యవసాయ ఇన్‌ఫుట్స్‌ రాకుండా అడ్డుపడుతున్న నియంత్రణ అధికారులపై పోరాడాల్సి ఉందని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలోని రైతాంగం ఈ దిశగా పోరాటం చేయాల్సి ఉందని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలలో త్రిప్స్‌పార్విస్‌ప్పైనస్‌ లాంటి పెస్ట్స్‌ నివారణకు అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక ప్రక్రియల వినియోగం అవసరం ఉందని అభిప్రాయపడింది.

 
ఈ నూతన  తెగులు మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పంట పూత కాలంలోనే ఇది తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా వాటి ఎదుగుదల నిలిచేలా చేస్తుంది. దీనికి తోడు భారీవర్షాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఈ అంశాల పట్ల చర్చించేందుకు జూమ్‌ సమావేశాన్ని ‘త్రిప్స్‌ వల్ల ప్రభావితమైన రైతులకు తగిన పరిష్కారాలను అందించే నేపథ్యంతో నిర్వహించింది. రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 
ఈ సందర్భంగా ఆర్‌కెపీఏ ప్రతినిధులు మాట్లాడుతూ సరైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ అయినటువంటి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, తగిన పురుగుమందులను తగిన మొత్తంలో వాడటంలోనే ఈ సమస్యకు తగిన పరిష్కారం దాగి ఉందన్నారు.

 
భారతదేశంలో రైతులు ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి నకిలీ పురుగుమందులు కాగా మరోటి తమ పంటలను కాపాడుకునేందుకు తగిన వ్యవసాయ రసాయనాలను వినియోగించేందుకు అవగాహన లేకపోవడం. ఎరువులు, పురుగుమందులను తగిన మొత్తంలో వాడటం ద్వారా భూసారం కాపాడవచ్చు.

 
‘‘తెలంగాణాలో వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌లాంటి చాలాప్రాంతాలలో 15-20% మంది మిర్చీ పంట పండిస్తున్నారు. వీరిలో చాలామంది నిరక్ష్యరాసులు.  ఈ కారణం చేతనే వారు ఎక్కువగా స్థానిక షాప్‌కీపర్లపై ఆధారపడుతున్నారు. వారు నకిలీ మందులు అంటగడుతున్నారు. మిర్చీ పంటకు ఎక్కువ శ్రమ అవసరం పడుతుంది. ప్రతిరోజూ దానిని చూడాల్సి ఉంది. ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా 30-40%పంట నష్టం జరుగుతుంది.

 
రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల చాలా వరకూ నష్టపోతున్నారు. మాలాంటి వాళ్లు వారి కోసం మాట్లాడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తోడ్పడేందుకు కృషి చేయాల్సి ఉంది. తగిన మొత్తంలో నాణ్యత కలిగిన పురుగుమందులు వాడటం మాత్రమే కాదు, సరైన సమయానికి వాటిని వాడటం కూడా అత్యంత కీలకం. అప్పుడు మాత్రమే త్రిప్స్‌ తెగులు లాంటి వాటిని అడ్డుకోగలం. ఆధునిక సాంకేతికతలైనటువంటి  డ్రోన్స్‌, ఏఐ వంటివి పురుగుమందులు సమానంగా పంపిణీ చేసేందుకు తోడ్పడతాయి’’ అని ఆర్‌కెపీఏ ప్రతినిధి అజయ్‌ అన్నారు

 
దేశంలో మిర్చీ పంట సాగులో 67% రెండు తెలుగు రాష్ట్రాలలోనే సాగు చేస్తున్నారు. 2020 తొలి దశలో ఈ రాష్ట్రాలలో త్రిప్స్‌ను పంటపై కనుగొన్నారు. ఇప్పుడది తీవ్రంగా ఉంది. పంట నష్టం తీవ్రంగా ఉండబోతుందన్న అంచనాలతో తెలంగాణా, గుంటూరు మార్కెట్‌లలో గత మూడు వారాలుగా 30%కు పైగా మిర్చీ ధరలు పెరిగాయి.

 
‘‘తామర (త్రిప్స్‌)తెగులు ప్రమాదకరమైనది. 2015లో తొలిసారిగా ఇండోనేషియా దీని కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. మిర్చీ భారీగా పండిస్తున్నది ఆంధ్ర మాత్రమే.  గుంటూరు ఏరియా మిర్చికి చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు గుంటూరు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలలో త్రిప్స్‌ తెగులు తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాలలో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి. నకిలీ ఎరువులు, పురుగుమందులను నియంత్రించాలి. వ్యవసాయ అధికారులు రైతులకు మద్దతునందించాలి. త్రిప్స్‌ నియంత్రణ కోసం తగినచర్యలను తీసుకోవాలి. ఆకు ముడత వ్యాధికి ఇది కీలకం. ఒకవేళ ఈ తెగులు నివారించలేకపోతే పంట దిగుబడి 30-50%కు పైగా తగ్గే అవకాశాలున్నాయి ’’అని ఆల్‌ ఇండియా  కిశాన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెసీసీ) జాతీయ సెక్రటరీ గుణావత్‌ పటేల్‌ అన్నారు.

ఈ సమావేశంలో సీఎన్‌ఆర్‌ఐ రీజనల్‌  వైస్‌ ఛైర్మన్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ శ్రీనివాస్‌ రెడ్డి మంకెన; ఆల్‌ ఇండియా కిశాన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకెసీసీ) జాతీయ సెక్రటరీ గుణావత్‌ పటేల్‌, రైతు సంఘ నాయకులు అజయ్‌ వాడియార్‌ తదితరులు పాల్గొన్నారు.