శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (12:53 IST)

మైనర్ బాలికపై 72ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచుల కోసం వెళ్లి..?

తెలంగాణలో ఘోరం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వృద్ధ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుజాత లా పబ్లిషింగ్‌ హౌస్‌ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017 నుంచి ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్‌ చేస్తుండేది.
 
ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి బాధితురాలు  విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్‌  స్వాధీనం చేసుకున్నారు.