1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:10 IST)

భర్త చనిపోతే ఆ వుద్యోగం కోసం భార్య... అది తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

భర్త చనిపోయిన మహిళ కారుణ్య నియామకం క్రింద అటెండర్ పోస్ట్‌కి దరఖాస్తు చేయగా ఒక అధికారి లంచం అడిగాడు. దాన్ని తీసుకోవడానికి మూడు చోట్లు మార్చాడు... అయినా పట్టుబడిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన వి.మల్లేశ్వరరావు పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తూ అనారోగ్యంతో మరణించాడు. అతని భార్య నాగలక్ష్మి కారుణ్య నియామకం క్రింద అటెండర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. 
 
కుటుంబ భారాన్ని మోసే భర్తను పోగొట్టుకుని శోక సముద్రంలో మునిగి ఉన్న ఆమెకు సహాయం చేయకపోగా, ఆ దస్త్రాన్ని ఆమోదించేందుకు సచివాలయంలోని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్దిశాఖ కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా పనిచేసే నాగరాజు రూ.60 వేలు లంచం అడిగాడు. లంచం కోసం నాగరాజు వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు లంచం ఇవ్వడానికి ఒప్పుకుంది. అదే సమయంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులను సంప్రదించింది. 
 
లంచాన్ని స్వీకరించడానికి బాధితురాలిని మొదటగా సూర్యాపేట రావాల్సిందిగా కోరాడు. కానీ మనసులో కొంత భయం ఉండటంతో దాన్ని తీసుకోలేదు. కానీ ఆశ మాత్రం చంపుకోలేదు. మరోమారు హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌కు రావాలని చెప్పాడు. నాగలక్ష్మి అక్కడకు వెళ్లినా అనుమానంతో డబ్బును తీసుకోలేదు.

మూడోసారి మంగళవారం మహత్మాగాంధీ ఇమ్లీబన్‌ బస్టాండుకు రమ్మన్నాడు. ఆమె అక్కడకు కూడా రావడంతో నమ్మకం కుదుర్చుకున్నాడు. డబ్బు తీసుకుని కడ్తాల్‌లో ఉన్న తన నివాసానికి అటు నుండి అటే వెళ్లాలని ప్లాన్ చేసాడు. లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు అతడిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని న్యాయస్థానానికి తరలించారు.