గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:55 IST)

ప్రధాని ఎదురుగా మహిళ నడుముపై చేయి వేసిన క్రీడల మంత్రి...

బాధ్యత గల పదవిలో ఉండి అందరినీ సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఒక మంత్రి వక్రబుద్ధిని బయటపెట్టాడు. పట్టపగలే ఒక వేదికపై మరో మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా నిల్చుని మరీ అలా చేయడం గమనార్హం.
 
వివరాల్లోకి వెళితే గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ త్రిపుర రాజధాని అగర్తలలో ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రితో పాటు చాలామంది మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తున్న సమయంలో మోదీకి ఎదురుగా నిల్చున్న మంత్రుల బృందంలోని రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి మనోజ్ కాంతి దేవ్ తన పక్కనే నిల్చుని ఉన్న మహిళా మంత్రి నడుముపై చేయి వేసి అసభ్యంగా తాకాడు.
 
అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో అతనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మనోజ్ కాంతి దేవ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై సదరు మంత్రి స్పందించేందుకు నిరాకరించగా బిజెపి మాత్రం దీన్ని తోసిపుచ్చింది. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే ప్రతిపక్షం ఇలా చేస్తోందని వారిపై దుమ్మెత్తి పోసారు.