శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:01 IST)

కేసీఆర్ మోసగాడు: షర్మిల

రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ పెద్ద మోసగాడని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందని షర్మిల ఆరోపించారు. కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వరని ఆమె మండిపడ్డారు.

నోటిఫికేషన్లు సకాలంలో వచ్చి ఉంటే ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. ఉద్యమం అప్పుడు ఏం చెప్పాం, ఇప్పుడేం చేస్తున్నాం అనే సోయి కేసీఆర్‌కు ఉండాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఇచ్చే 35 వేల ఫీజు రియంబర్స్‌మెంట్‌కి ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. బోధన సిబ్బంది లేకుండా యూనివర్సిటీలను నడిపిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని ఆమె అన్నారు.
 
రాష్ట్రంలో 34 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం చూస్తుంటే కేవలం 3 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని షర్మిల పేర్కొన్నారు. 5 వేలను రైతుబందు పథకంలో ఇచ్చి ఎకరానికి 15 వేలను వడ్డీ రూపంలో రైతుల నుంచి కేసీఆర్ వసూలు చేస్తున్నాడని షర్మిల ఆరోపించారు.

బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణ, చావుల తెలంగాణ అయిందన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయలన్నారు. ఏం ఉద్ధరించారని సీఎంగా కేసీఆర్‌ ఉండాలని షర్మిల ప్రశ్నించారు.