గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (11:28 IST)

"గ్రేటర్ వార్" : అభ్యర్థులు - ఓటర్లు పాటించాల్సిన నిబంధనలు ఇవే...

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల పోలింగ్ డిసెంబరు ఒకటో తేదీన జరుగనుండగా, నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల విధిగా పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
* నామినేషన్ వేసేందుకు కేవలం రెండు వాహనాల్లో మాత్రమే రావాల్సి వుంటుంది. ఆపై, అభ్యర్థుల ప్రచారం సమయంలో భద్రతా సిబ్బందిని మినహాయిస్తే, ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండేందుకు వీల్లేదు. 
 
* ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ప్రచార సభలను విశాలమైన హాల్స్‌లో కెపాసిటీలో సగం మందికి మాత్రమే అనుమతిస్తూ నిర్వహించుకోవాలి. అక్కడ కూడా శానిటైజర్, మాస్క్ తప్పనిసరిగా ఉంచాలి. 
 
* ఇక రిటర్నింగ్ అధికారి చాంబర్‌లో సైతం భౌతిక దూరం నిబంధనలు అమలవుతాయి. చిహ్నాల కేటాయింపు కూడా విశాలమైన ప్రదేశంలో చేయాల్సి వుంటుంది. నామినేషన్ దాఖలు చేసే వేళ, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. 
 
* పోలింగ్ సిబ్బంది మరిన్ని వాహనాలు సమకూర్చుకుని కిక్కిరిసిన విధంగా కాకుండా, దూరదూరంగా కూర్చుని పోలింగ్ బూత్‌లకు వెళ్లాలి. ఎన్నికల సిబ్బంది ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకునివుండాలి. 
 
* ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో ఉంటే, వారి స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలైనంత మంది రిజర్వుడ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.
 
* ఇక ఓటర్ల విషయానికి వస్తే, ముఖానికి నిర్దేశిత విధానంలో మాస్క్ తప్పనిసరి. మూతి, ముక్కు మూసుకునేలా మాస్క్ ధరిస్తేనే పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతిస్తారు. 
 
* ఆపై అసలైన ఓటరును గుర్తించేందుకు ఒకమారు మాస్క్ తీయాల్సి వుంటుంది. ఆపై వెంటనే మాస్క్ ధరించాలి. ఓటేసే సమయంలో ఒక్కో ఓటరు మధ్య కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరి. ఇందుకోసం ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో మార్కింగ్ చేయాలి.
 
* కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలి. పోలింగ్ అధికారులు, సిబ్బందికి సరిపడినన్ని మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్‌లను ముందుగానే సిద్ధం చేయాలి. 
 
* ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా ఇదే తరహా ముందు జాగ్రత్తలు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.