శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

జీహెచ్ఎంసీ ఎన్నికలు : మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)కి డిసెంబరు నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో అభ్యర్థులు, ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలతో పాటు నామినేషన్లు, ప్రచారపర్వానికి సంబంధించిన అంశాలపై అందులో స్పష్టం చేసింది. 
 
జీహెచ్​ఎంసీ యాక్టును అనుసరిస్తూ గతం మాదిరిగానే ఈసారి కూడా జనరల్​ కేటగిరీలోని అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ ​సొమ్ముగా నిర్ధారించింది. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. 
 
ప్రతిపాదిత, బలపర్చే అభ్యర్థులు స్థానికంగా ఉన్న వార్డులకు చెందినవారు కావాలని, వార్డుల జాబితాలో ఓటు హక్కు ఉన్నవారే ప్రతిపాదించాల్సి ఉంటుందని పేర్కొంది. గ్రేటర్​లో ఓటు హక్కు ఉన్న వారు ఏ వార్డుల్లోనైనా పోటీ చేసేందుకు అర్హులని తెలిపింది. 
 
అంతేకాకుండా, జనవరిలో నిర్వహించిన కొంపల్లి మున్సిపల్​ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఫేస్​ రికగ్నైజ్​ పోలింగ్​ను చేపట్టి 80 శాతం సక్సెస్​ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు గ్రేటర్​ ఎన్నికల్లో ప్రతి వార్డులోని ఒక పోలింగ్​ కేంద్రంలో ఫేస్​ రికగ్నైజ్​ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 
 
ముఖ్యంగా, పాతబస్తీ పోలింగ్​ కేంద్రాల్లో ఈ విధానాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటరు జాబితా, పోలింగ్​ కేంద్రాల ముసాయిదా నేపథ్యంలో గ్రేటర్​ అధికారులు ఫేస్​ రికగ్నైజ్​ సెంటర్​ ఏర్పాటు చేసే జాబితాను సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సామగ్రి, ఇంటర్నెట్​ ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి ఈ కేంద్రాలు ఖరారు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పాతబస్తీలో ఈ కేంద్రాల ఏర్పాటును వద్దని కోరుతూ ఇప్పటికే ఎంఐఎం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 
 
దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని వార్డుల్లో ఒక్క సెంటర్​లో ఫేస్​ రికగ్నైజ్​ ఏర్పాటు చేస్తుండగా పాతబస్తీ పరిధిలోని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని, అభ్యంతరం వ్యక్తం చేసే ఓటర్లకు మినహాయింపు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.