శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (15:33 IST)

కనగరాజ్ ఇంటికి జగన్ సర్కారు అద్దె చెల్లించడమేంటి? నిలదీసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమితులైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని హైకోర్టుతో పాటు.. సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మూటముల్లె సర్దుకుని చెన్నైకు వెళ్లిపోయారు. అయితే, ఆయన కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడ బెంజి సర్కిల్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని ఎంపిక చేసింది. ఈ ఇంటి యజమాని పేరు వల్లూరి రవీంద్రనాథ్. 
 
అయితే, ఆ తర్వాత కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ఆయన ఆ ఇంటిలో ఉండటం లేదు. దీంతో ఇంటి యజమాని రవీంద్రకు ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. 
 
ఇదిలావుంటే, కనగరాజ్ నియామకం చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఆయన న్యాయపోరాటం చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. 
 
ఈ అంశంపై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కనగరాజ్ న్యాయపోరాటానికి ప్రభుత్వం ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఆ మొత్తాన్ని కనగరాజ్ వ్యక్తిగతంగా భరించాలని తెలిపింది.
 
ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ అంశంతో పాటు కనగరాజ్ ఇంటి కోసం రూ.20 లక్షలు, ఫర్నిచర్ కు రూ.15 లక్షల అంశాన్ని కూడా ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పరిశీలించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.