శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:59 IST)

యువతకు నచ్చినవారితో జీవించే హక్కుంది : అలహాబాద్ హైకోర్టు

యువతకు తమ మనస్సుకు నచ్చినవారితో జీవించే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి.. తన భర్తతో కలిసి జీవించేలా ఆదేశాలిస్తూ, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పై విధంగా వ్యాఖ్యానించింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్‌లు ప్రేమించుకున్నారు. వీరివి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 
 
వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరినీ ఓ గదిలో నిర్బంధించారు. అయితే, వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందంటూ తీర్పునిచ్చారు. పైగా, ఆ నవదంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.