శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో ప్రియురాలు - దుబాయ్‌‌లో ప్రియుడు ... ఈ జీవితాలు మాకొద్దంటూ సూసైడ్ ..

తెలంగాణా రాష్ట్రంలో ఓ ప్రేమికురాలు బలవన్మరణానికి పాల్పడిందిం. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్‌లో ఉంటున్న ప్రియుడు కూడా సెల్ఫీ వీడియో ఒకటి తీసి, తన స్నేహితులకు పంపించాడు. ఆ తర్వాత తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మానాల లస్మయ్య, అమృతవ్వ దంపతుల మూడో కుమారుడు రాకేశ్‌ (21) అనే యువకుడు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే, ఈ కుర్రోడు గ్రామంలో ఉండగానే అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. 
 
అయితే, యువతికి పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులు మరో సంబంధాలు చూడసాగారు. ఈ కారణంతో రాకేశ్‌ ప్రేమించిన యువతి (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన రాకేశ్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 
 
దుబాయ్ క్యాంపులోని గదిలో శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు రాకేశ్‌ సెల్ఫీ వీడియో తీస్తూ 'కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఈ రోజు నా నుంచి దూరమయ్యింది. అమ్మాయి లేని జీవితం నాకొద్దు. బై మమ్మీ ఐ మిస్‌ యూ' అంటూ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.