ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (12:55 IST)

24 గంటల్లో నవజాత శిశువులకు శిశు ఆధార్ కార్డుల జారీ

new born baby
తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో నవజాత శిశువులకు శిశు ఆధార్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. ప్రసవించిన 24 గంటల్లోపు నవజాత శిశువుల తల్లిదండ్రులకు శిశు ఆధార్ జారీ చేయబడుతుంది. తల్లి ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబర్ తప్పనిసరి. తల్లికి ఆధార్ కార్డు లేకపోతే, తండ్రి కూడా ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.
 
తెలంగాణలో బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే శిశు ఆధార్ కార్డును జారీ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఆధార్ కార్డు తప్పనిసరిగా జారీ చేయాలి. 
 
ఇందుకోసం ఆసుపత్రి అధికారులు నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని ఆన్ లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు 15 రోజుల్లోపు పిల్లల ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఆధార్ కార్డ్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.
 
దరఖాస్తు చేసిన 45 రోజుల్లోగా శిశు ఆధార్ కార్డు నేరుగా ఇంటికే పోస్ట్ ద్వారా డెలివరీ చేయబడుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించి ఆరు నెలలైంది. మొదటి దశలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 45 పిల్లల ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 20న రెండో విడత ప్రారంభమైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ప్రభుత్వ కుటుంబ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.