1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఆత్మహత్య చేసుకున్న వదిన శవాన్ని బస్తాలో కట్టి డ్యాంలో పడేసిన మరిది

deadbody
తెలంగాణా రాష్ట్రంలోని మోమిన్ పేటలో దారుణం జరిగింది. మరిది కొట్టినందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బయటకు తెలిస్తే గొడవ అవుతుందని భావించిన మరిది.. వదిన శవాన్ని గోనె సంచిలో మూటగట్టి సింగూర్ డ్యామ్‍‌లో పడేశాడు. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోమిన్‌పేట మండల పరిధి అమ్రాదికలాన్‌ గ్రామానికి చెందిన సంఘముని (45) భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి కూతుళ్లు, మరిది మేకల శ్రీనివాస్‌, మామ బీరయ్య అందరూ కలిసి ఉంటున్నారు. 
 
కొన్నాళ్లుగా వారి మధ్య సొంత భూమి 10 ఎకరాలకు సంబంధించి వివాదాలు సాగుతున్నాయి. గత ఆదివారం రాత్రి మామ, మరిది అతని భార్య లక్ష్మి కలిసి గొడవ పెట్టుకొని ఆమెను కొట్టారు. మనస్తాపానికి గురైన ఆమె మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయం తెలసుకున్న మరిది గ్రామ పెద్దలకు తెలిస్తే కుటుంబ సభ్యులకు శిక్ష పడుతుందని ఎవరికీ అనుమానం రాకుండా తన స్నేహితుడు శ్రీహరి సహాయంతో శవాన్ని బావిలో నుంచి వెలికి తీసి ఓ మసాల సంచిలో కట్టి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పరిసరాలలోని సింగూర్‌ డ్యాం వంతెన పైనుంచి నీటిలో పడేశాడు. 
 
ఏమీ తెలియనట్టు మంగళవారం అతను ఠాణాకు వచ్చి తన వదిన కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. మహిళ అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా సంఘముని మృతికి కారణం కుటుంబ సభ్యులేనని తేలింది. 
 
ఆ తర్వాత మరిదిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా శవాన్ని సింగూర్‌ డ్యాంలో పడేసినట్టు చెప్పాడు. శనివారం డ్యాం దగ్గరికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. నిందితులను విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.