గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (17:07 IST)

నాలుగు సీట్లు గెలిచారో లేదో కాలు కింద నిలవడం లేదు : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు నాలుగు సీట్లు గెలిచారో లేదో వారి కాళ్లు కింద నిలవడం లేదని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో చేసిన చిట్‌చాట్ వివరాలను పరిశీలిస్తే, 
 
* అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ చట్టం అవినీతిని పారదోలుతుంది.
* ప్రజలకు మేలు చేసేలా చట్టం ఉంది. రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు సేవలు పారదర్శకంగా అందుతాయి.
* నేను మంత్రిగా ఉండగా ఎన్నో స్టేలు ఇచ్చాను. ఇప్పుడా అవకాశం ఉండదు. 
* టీఎస్ ఐపాస్ చట్టం విజయవంతం అయినట్టే మున్సిపల్ చట్టం అమలవుతుంది. 
* చట్టాలు అమలు కావాలంటే పాలకులకు చిత్తశుద్ధి అవసరం. మా చిత్తశుద్ధితొనే టీఎస్ ఐపాస్‌తో సత్ఫలితాలు వచ్చాయి.
* కరెక్టు టైములో మున్సిపల్ చట్టం వచ్చింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేసేవారికి కూడా చట్టం తెలుసుకునే వీలుకలిగింది.
* మంచి పాలనా సంస్కరణలు వస్తే ఎమ్మెల్యేలకు గౌరవం పెరుగుతుంది. నోటీసు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను కూల్చి వేసే అధికారం కొత్త చట్టం కల్పిస్తుంది .
* ప్రజలకు సెల్ఫ్ అస్సెస్మెంట్ అధికారం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. 
*  ప్రజలకు అవినీతి చీడ నుంచి రక్షణ కల్పించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. 
* సీఎం మొండి వారు. అనుకున్నది సాధిస్తారు. మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. 
* కొత్త చట్టం ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చట్టంతో ఉద్యోగులు ఒకే చోట పాతుకుపోవడం కుదరదు. 
* ఇది శుభపరిమాణం, పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టం తరహాలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతోంది. 
* ప్రజలకు అవినీతి రహిత పాలన ఇవ్వడం మా ప్రభుత్వ ధ్యేయం. కొత్త మున్సిపల్ చట్టం స్ఫూర్తి జీహెచ్‌ఎంసీకి కూడా ఉంటుంది. 
* మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదే. 
* మున్సిపాలిటీ ల్లో 75 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదని కొత్త చట్టంలో చెప్పడం పేదలకు ఊరటనిచ్చే అంశం. 
* దీన్ని తెరాస ఎమ్మెల్యేలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కొత్త మున్సిపల్ చట్టంతో జిల్లా కలెక్టర్లకు పనిభారం పెరుగుతుందని అనుకోను. 
* జిల్లాకు మూడు, నాలుగు మున్సిపాలిటీలే ఉన్నాయి. కనుక కలెక్టర్లపై పెద్దగా భారం ఉండదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతోంది.
* ప్రజలకు జరుగుతున్న మేలేమిటో నేను రాజన్న సిరిసిల్లాలో ప్రత్యక్షంగా చూస్తున్న. 
* కొత్త మున్సిపల్ చట్టంతో ప్రజలపై భారం పడకుండా చూస్తాం. 
* తెరాస పార్టీ సభ్యత్వం ఇప్పటికే 35 లక్షలు దాటింది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. గతంలో తెరాస సభ్యత్వం 43 లక్షలు ఉంది. దాన్ని అధికమిస్తాం. 
* బీజేపీ వాళ్ళు నాలుగు ఎంపి సీట్లు గెలవగానే ఆగడం లేదు. బీజేపీ గెలిచింది ఎనిమిది జడ్పీటీసీలు మాత్రమే
.. ఎవరేమిటో మున్ముందు తేలుతుంది. 
* మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అగ్రభాగాన ఉంటుంది. రెండో స్థానం గురించి ఆ రెండు పార్టీ లు తేల్చుకోవాలి. మాకెందుకు?
* మంచి మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో తెరాసకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. 
* గత ఐదున్నరేళ్ళలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలు తెచ్చాం. 
* కాంగ్రెస్ సంక్షోభంలో ఉంది. ఏఐసీసీకి ఇపుడు అధ్యక్షుడే లేరు. పీసీసీకి కూడా లేనట్టే ఉంది. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై మాకు ఆసక్తి లేదు. 
* కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కేసు కోర్టులో ఉంది. కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. వివాదం కోర్టులో ఉండగా నేను మాట్లాడను. 
* ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల స్థలాల కేసు సుప్రీం కోర్టులో ఉంది. వారం రోజుల్లో ఇందుకు సంబంధించి పరిష్కారం కనుగోవాలని ఈ రోజే సీఎం కేసీఆర్ సీఎంఓ అధికారులను ఆదేశించారు.
* జర్నలిస్టుల సమస్యల పరిష్కార బాధ్యత నాది. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతో భేటీ అవుతా. గవర్నర్‌ను మార్చడంపై సమాచారం లేదు.
* గవర్నర్ వ్యవస్థల్లో తలదూర్చి ఏదో చేయడం లాంటిది ఏం ఉండదు. ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలో అది పని చేస్తే ఇబ్బందులు ఉండవు.