బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (14:10 IST)

ఏపీ సీఎం జగన్ చెప్పినట్లు సీఎం కేసీఆర్‌కి కూడా జరుగుతుంది... విజయశాంతి

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కుడు గారు చేస్తున్న ఆమరణ దీక్ష ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసిందని విజయశాంతి అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా తనకు సంకల్పించిన ప్రతిపక్ష హోదాను దౌర్జన్యంగా లాక్కోవడం మీద నిరసన వ్యక్తం చేస్తూ భట్టి విక్రమార్కుడు  నిరసనకు దిగడం తెలంగాణ సమాజాన్ని కదిలించింది.. కలచివేసింది.
 
ఎల్లకాలం తామే అధికారంలో ఉంటాం అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న తప్పులు శిశుపాలుడి తప్పుల్ని మించి పోతున్నాయి. మంది బలంతో తాము ఏం చేసినా చెల్లుతుందనే బరితెగింపుతో టిఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న అరాచకాలను చూసి తెలంగాణ ప్రజలంతా రగిలిపోతున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతి సందర్భంలోనూ ఇతర రాజ్యాంగ వ్యవస్థలు తమ వంతు పాత్ర పోషించినా,  పోషించక పోయినా... చివరకు ప్రజలే తగిన తీర్పునివ్వడం ఆనవాయితీ. 
 
ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కొని చంద్రబాబు నాయుడు గారు సంబరపడ్డారని... దేవుడు వ్రాసిన స్క్రిప్టుతో ఆయన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి తగిన శాస్తి జరిగిందని జగన్ గారు చెప్పారు. జగన్ గారు చెప్పింది నిజమైతే.. ఏపీ లోనే కాదు తెలంగాణాలో కూడా టిఆర్ఎస్ హైకమాండ్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుపై దేవుడు త్వరలోనే స్క్రిప్ట్ రాస్తాడు. దాని  పరిణామాలను టిఆర్ఎస్ అనుభవించక తప్పదు అంటూ చెప్పారు విజయశాంతి.