1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (06:13 IST)

ఆ‌ర్టీసీని ఏం చేస్తారో?... సర్వత్రా ఉత్కంఠ

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సుధీర్ఘంగా 9 గంటల పాటు రివ్యూ చేశారు. ఈ సమావేశం అనంతరం.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

అటు ఆర్టీసీ సమ్మె కేసులోనూ హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు అధికారులు. ఆర్టీసీ ఎండీ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ నివేదిక ఇచ్చారు. రవాణాశాఖ మంత్రికి సెప్టెంబర్‌ 11నే ఆర్థిక అంశాలు వివరించామని తెలిపారు ఆర్టీసీ ఎండీ.

ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే రూ.867 కోట్లు ఎక్కువే వచ్చాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ ఎలాంటి బకాయి లేదన్నారు సునీల్‌ శర్మ.
 
ఆర్టీసీకి తానేమీ బకాయి లేనని ప్రభుత్వం తేల్చేసింది. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీయే ప్రభుత్వానికి రూ.453 కోట్లు బాకీ ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు.

మూడు అఫిడవిట్లు, రెండు తాఖీదులు ఆర్టీసీ సంక్షోభ పరిష్కారం ఆశలను నీరుగార్చేశాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికన్నా ప్రభుత్వం రూ.897 కోట్లు అదనంగా ఇచ్చిందని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చెబితే, ఆర్టీసీయే మోటారు వాహనాల పన్ను కింద రూ.453 కోట్లు బకాయి పడిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.

ఈ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని ఆర్టీసీకి రవాణా శాఖ తాఖీదు పంపింది. దీనికి తోడు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ నిధి 411 కోట్లు ఆర్టీసీ వాడుకోవడంపై హైకోర్టు భగ్గుమంది. తక్షణమే రూ.200 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ఇవన్నీ కుంగిపోతున్న సంస్థకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇచ్చే అవకాశాలు మృగ్యమైపోతున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఎలాంటి బకాయిలు లేవని ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌లు వేర్వేరుగా బుధవారం అఫిడవిట్లు దాఖలు చేశారు.

సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు ఈ అఫిడవిట్లు ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సుమారు 3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా 3,903 కోట్లు చెల్లించిందన్నారు. గురువారం జరిగే విచారణకు సీఎస్‌తో పాటు అధికారులు హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తమకు చెల్లించాల్సిన రూ. 453 కోట్లను తక్షణమే చెల్లించాలని ఆర్టీసీకి రవాణా శాఖ తాఖీదులు జారీచేసింది.