శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (12:10 IST)

తెలంగాణలో వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు.. సర్కారు గ్రీన్‌సిగ్నల్

సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పే విధంగా వాట్సాప్‌ను వినియోగించేందుకు శ్రీకారం చుట్టారు.
 
ఇప్పుడు కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే పిల్లలకు చదువులు చెప్పేస్తున్నారు.. అదీ వాట్సాప్ ద్వారా. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్‌ పర్యవేక్షణ. బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. 
 
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్‌ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు.
 
ఇందులో భాగంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. క్లాస్‌ టీచర్‌ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్‌ వాడకం అనివార్యమైంది.