గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (10:45 IST)

భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..

కుమారుడికి అన్నం తినిపించి.. నిద్రపుచ్చి.. బలవన్మరణంతో శాశ్విత నిద్రలోకి జారుకున్నాడు ఆ తండ్రి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో కలత చెందిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన  హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలు పరిశీలిస్తే పెద్దల్ని ఎదిరించి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు విజయబాబు,రాణి. భార్య కోసం విజయ బాబు తన పేరును ప్రభువుగా మార్చుకున్నాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వినోష్ అనే కుమారుడు జన్మించాడు.
 
కొంతకాలం అన్యోన్యంగానే సాగిన కుటుంబంలో కలతలు రేగాయి. కుమారుడు వినోష్‌ను భర్త వద్దే వదిలిపెట్టి.. నాలుగు రోజుల క్రితం పుట్టింటికెళ్లింది రాణి. అప్పటి నుంచి ప్రభువు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నాలుగో తరగతి చదివే కుమారుడు వినోష్ ట్యూషన్‌కు వెళ్తానని చెప్పినా.. ప్రభువు వద్దని వారించాడు. కుమారుడికి చివరిసారిగా అన్నం ముద్దలు కలిపి పెట్టి తినిపించాడు. బాబు వినోష్‌ను నిద్రపుచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో హాల్లోని ఇనుప కొక్కేనికి చీరతో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు ప్రభువు. 
 
ఇరుగుపొరుగు గమనించి.. తలుపు బాది వినోష్‌ని నిద్రలేపారు. కుమారుడు వినోష్ కళ్లు తెరిచి చూసేసరికి షాక్.. తండ్రి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించేసరికి గుండెలవిసేలా రోదించాడు ఈ పసివాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారని.. భర్తని వదిలి ఆమె పుట్టింటికి వెళ్లిందని చెప్తున్నారు మృతుని బంధువులు. రెండ్రోజుల క్రితం నల్లకుంట పోలీసుస్టేషన్లో భర్త ప్రభువుపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని.. దాంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని చెప్తున్నారు. 
 
రాణికి తన బావతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబీకులు. నాన్న ఉరేసుకుని చనిపోయాడంటూ ఎనిమిదేళ్ల బాబు వినోష్ బంధువులందరికీ ఫోన్లు చేయడంతో ఇంటి వద్ద తీవ్ర విషాదం అలుముకుంది. సూసైడ్ నోట్ కూడా లభించలేదని.. మృతికి కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని చెప్తున్నారు పోలీసులు.